
నష్టపోయిన వారిని ఆదుకోండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్/శివ్వంపేట(నర్సాపూర్): వడగళ్ల వా నతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోవడం తప్ప, చేసిందేమి లేదని విమర్శించారు. బడ్జెట్లో పంటల బీమా కోసం నిధులు కేటాయించలేదని విచారం వ్యక్తం చేశారు. బీమా ఉంటే రైతులకు ధీమా ఉండేదన్నారు. తాను అసెంబ్లీలో రైతులు పండిస్తున్న పంటలకు బీమా చేయాలని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చేతికొచ్చిన పంటలు వడగళ్ల వానతో పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆమె వెంట ఆర్ఐ కిషన్, ఏఈఓ మౌనిక, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.