
భూ సమస్యలకు మోక్షం
భూ సమస్యలకు మోక్షం!
సర్వేకు నోచుకోని
వేలాది ఎకరాలు
జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాలకు పైగా భూములు సమస్యల్లో ఉన్నాయి. ఆ భూములు మావి అని రెవెన్యూ శాఖ వారు అంటే, కాదు మావి అంటూ ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలు ఇస్తే, అవి మావంటూ ఫారెస్ట్ అధికారులు లాక్కున్న ఘటనలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ భూములు సర్వేకు నోచుకోకుండా పోయాయి.
ధరణి స్థానంలో ‘భూ భారతి’
● జిల్లావ్యాప్తంగా పార్ట్(బీ)లో 30 వేల ఎకరాలు
● కొత్త మాడ్యూల్స్తో లభించనున్న పరిష్కారం
నూతన రెవెన్యూ చట్టం భూ భారతితో
భూ సమస్యలకు మోక్షం లభించనుంది. మొన్నటి వరకు ధరణిలో ఎలాంటి భూ సమస్యలున్నా దరఖాస్తు చేసుకుంటే అది కలెక్టర్ లాగిన్కు వచ్చేది. దీంతో చాలా జాప్యం జరగగా.. ఏళ్లుగా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం తీసుకొస్తున్న భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో.. మొత్తంగా జిల్లాలోనే భూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. – మెదక్జోన్
జిల్లాలో సుమారు 30 వేల పైచిలుకు భూములు నిషేధిత పార్ట్ (బీ)లో ఉన్నాయి. గత ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన ధరణి చట్టంలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్కు సైతం అధికారం ఇవ్వకుండా మాడ్యూల్స్ను తయారుచేశారు. ఏ చిన్న సమస్య ఉన్నా, వాటిని వెంటనే పార్ట్(బీ)లో పెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో భూముల క్రయ, విక్రయాలు నిరంతరంగా కొనసాగుతాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించే వీఆర్ఓలను తొలగించారు. గతంలో భూ సమస్యలు ఉత్పన్నం అయితే తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ స్థాయి అధికారుల వద్ద పరిష్కారం లభించేది. ధరణిలో అలాంటివేవి లేకుండా చేశారు.
మచ్చుకు కొన్ని..
● మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబుపేటలో 236, 216, 309 సర్వే నంబర్లలో 800 ఎకరాల పరంపోగు (పట్టా) భూములకు సంబంధించి 250 మంది రైతులకు పట్టాలు ఉన్నాయి. వారు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బోర్లు వేసి పంటలు పండించుకున్నారు. కాగా ధరణి కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఆ గ్రామంలోని మూడు ఈ సర్వే నంబర్లను పరిశీలించగా రికార్డుల్లో 1,000 ఎకరాలు ఉన్నట్లు తెలింది. ధరణి వచ్చాక ఆ గ్రామంలోని 800 ఎకరాలను పార్ట్(బీ)లో పెట్టారు. ఏళ్ల తరబడి ఉన్న పట్టాలను రద్దు చేశారు. అధికారుల తప్పిదంతో రికార్డుల్లో ఎక్కువ భూమిని రాస్తే మా భూములు (పార్ట్ బీ)లో ఎలా పెడతారని పేద రైతులు ప్రశ్నించారు.
● కౌడిపల్లి మండలం మహ్మద్నగర్లో సుమారు 80 ఎకరాల భూములకు సంబంధించి ఆ గ్రామంలోని కొంత మంది రైతులకు పట్టాలు ఉండగా, వారు భూములు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ధరణి చట్టం అమల్లోకి వచ్చాక గతంలో ఆ భూములు ఓ భూస్వామివని తేలింది. అతని పేరు తెరపైకి రావడంతో సదరు వ్యక్తి హైదరాబాద్లో ఉండి మరో వ్యక్తికి భూములు విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి గ్రామానికి వచ్చి భూములు తమవే అని అనడంతో ప్రస్తుతం గ్రామంలో గొడవలు జరుగుతన్నాయి.
● చిన్నశంకరంపేట మండలం జంగరాయి శివారులో 406, 360, 274 సర్వే నంబర్లలో అబ్దుల్ ఖాదర్ భూములు 500 ఎకరాలు ఉండగా.. వాటిని కొంతకాలంగా వందలాది మంది రైతులు పట్టాలు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. ధరణి అమల్లోకి వచ్చాక ఆ మూడు సర్వే నంబర్లను తీసి వేసి ఒకటే సర్వే నంబర్గా మార్చి అసైన్మెంట్ పట్టాలుగా రికార్డుల్లో పొందుపరిచారు. గతంలో ఆ భూములకు సంబంధించి రైతులు క్రయ, విక్రయాలు జరిపారు. ప్రస్తుతం వాటిని అసైన్మెంట్గా మార్చడంతో ఆందోళన చెందుతున్నారు.