
రేపటి నుంచి బేతాళస్వామి జాతర
అల్లాదుర్గం(మెదక్): ఏడుపాయల జాతర తర్వాత జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే బేతాళ స్వామి జాతర ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరవుతుంటారు. జాతరలో జంతు బలులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బేతాళస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో 4 వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం. సమీప గ్రామాలకు చెందిన భక్తులు ఎడ్ల బండ్లను అలంకరించి ఆలయం చట్టూ తిప్పుతారు. బేతాళ స్వామిపై భక్తితో అల్లాదుర్గంతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు తమ పిల్లలకు బేతయ్య, బేతమ్మ పేర్లను ఎక్కువగా పెట్టుకుంటారు. 14న పోలేరమ్మ దేవతకు, 15న పోచమ్మకు, 16న దుర్గమ్మకు, 17న బేతాళస్వామికి బోనాలు తీయడం అనావాయితీ. 18న ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు తిప్పటం. 19న భాగవతం, 20న భజనలు, 21న వినోద కార్యక్రమాలు, 22న ఉదయం పాచి బండ్లు తిరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.