అనారోగ్యం భరించలేక వివాహిత ఆత్మహత్య
దండేపల్లి: అనారోగ్యం భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. మండలంలోని రాసపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పద్మ (46) కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపం చెంది మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. చేపల వేటకు వెళ్లిన భర్త ఇంటికి రాగానే ‘పిల్ల లను బాగా చూసుకో.. నేను ఇక బతకను..’ పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే అతను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందింది. భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


