నువ్వక్కడ.. నేనిక్కడ..!
నిర్మల్టౌన్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈసారి నిర్మల్ మున్సిపాల్టీలో పోటీ ఆసక్తికరంగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భార్యాభర్తలు వేర్వేరు వార్డుల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్థానికంగా పట్టున్న కుటుంబాలు కావడంతో పార్టీల నుంచి రెండేసి సీట్లు సాధించారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. మూడు జంటలు బరిలో నిలువడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అప్పాల కావ్య, గణేశ్ చక్రవర్తి
నిర్మల్ మున్సిపల్ చైర్మన్ పదవి మహిళలకు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి భార్య కావ్య 36వ వార్డు నుంచి పోటీలో దిగారు. ఆయన 37వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ.. పక్కపక్క వార్డులో పోటీలో ఉండి రాజకీయాల్లో ఆసక్తి పెంచుతున్నారు. అధికార పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి కావడంతో అందరి దృష్టి ఈ వార్డుపై ఉంది.
27, 39వ వార్డుల్లోనూ..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా 27, 39 వార్డుల నుంచి భార్యాభర్తలు పోటీలో దిగారు. వీరిద్దరూ ప్రస్తుతం తాజా మాజీ కౌన్సిలర్లు. వీరే మళ్లీ పోటీలో ఉన్నారు. 27వ వార్డు నుంచి అయేషా కౌసర్ పోటీలో ఉండగా..39వ వార్డు గుల్జర్ మార్కెట్ నుంచి ఆమె భర్త తౌహీద్ ఉద్దీన్ రఫ్ఫు పోటీలోకి దిగారు. వీరిద్దరూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
30, 40వ వార్డుల్లో..
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా 30, 40 వార్డుల నుంచి భార్యాభర్తలు పోటీలో దిగారు. భర్త అయ్యన్నగారి రాజేందర్ 9వ వార్డు నుంచి నా లుగు సార్లు కౌన్సిలర్గా పనిచేశారు. ప్రస్తుతం 30వ వార్డు నుంచి పోటీలోకి దిగారు. అలాగే ఈసారి అతని భార్య మాధవిని 40వ వార్డు చింతకుంట వాడ నుంచి పోటీలోకి దించారు.
అప్పాల కావ్య, గణేశ్ చక్రవర్తి
అయ్యన్నగారి మాధవి, రాజేందర్
అయేషా కౌసర్, తౌహీద్ ఉద్దీన్
నువ్వక్కడ.. నేనిక్కడ..!
నువ్వక్కడ.. నేనిక్కడ..!


