ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ సబ్ జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా యువజన క్రీడల అధికారి హన్మంతరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈనెల 5 నుంచి 8 వరకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని సూచించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కోశాధికారి గాజుల శ్రీనివాస్, ఆదిలాబాద్ బాధ్యుడు దాసారపు సందీప్, ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, జిల్లా పీఈటీల సంఘం నాయకులు రామ్మోహన్రావు, గోపాల్, సుదర్శన్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.


