మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

Jan 13 2026 5:51 AM | Updated on Jan 13 2026 5:51 AM

మద్యా

మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

● వలకు చిక్కుకుని మత్స్యకారుడు మృతి

ఆదిలాబాద్‌టౌన్‌: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణంలోని పాత హౌజింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న ఎల్చల సాయిరాం (30) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఐదేళ్లుగా తెల్లకల్లుకు బానిసయ్యాడు. ఆదివారం రాత్రి తాగిన మైకంలో ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య ఎల్చల నికిత ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

చికిత్స పొందుతూ బాలిక మృతి

తానూరు: మండలంలోని దాగం గ్రామానికి చెందిన డాకే సురేఖ (16) నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపారు. సదరు బాలిక ఈనెల 6న కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగింది. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లి సావిత్రిబాయి గమనించి చికిత్స నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఘన్‌శామ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై జుబేర్‌ వెల్లడించారు.

ప్రాణం తీసిన చేపల వేట

లక్ష్మణచాంద: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోన్‌ మండలంలోని గాంధీనగర్‌కు చెందిన శంకర్‌ (35) ఆదివారం సాయంత్రం చేపల వేటకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు వల కాలుకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై దేవన్న తెలిపారు.

రోడ్డు ప్రమాద మృతుడు ఆస్నాద వాసి

చెన్నూర్‌రూరల్‌: మండలంలోని అక్కెపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఆస్నాద గ్రామ వాసి పెద్ద పోలు సంపత్‌ గౌడ్‌ (40)గా సోమవారం పోలీసులు గుర్తించారు. చెన్నూర్‌ నుంచి సిరోంచ వైపునకు వెళ్తున్న కారును చెన్నూర్‌ వైపు వస్తున్న ఇసుక లారీ అక్కెపల్లి బస్‌స్టాప్‌ సమీపంలో ఢీ కొట్టడంతో సంపత్‌గౌడ్‌ కారులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

క్రీడలకు చెన్నూర్‌ పెట్టింది పేరు

చెన్నూర్‌: జిల్లాలో క్రీడలకు చెన్నూర్‌ పెట్టింది పేరని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాఽథ్‌రావు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్‌ పోటీలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏతం శివకృష్ణ వాలీబాల్‌ పోటీలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కారెంగుల రామయ్య, కొండపాక చారి, జాడి తిరుపతి, గర్రెపల్లి వెంకటనర్సయ్య, కేవీఏం శ్రీనివాస్‌, పీఈటీలు పాల్గొన్నారు.

‘బూత్‌ నిర్మాణ అభియాన్‌’ విజయవంతం చేయాలి

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల జిల్లా బూత్‌ నిర్మాణ అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో బూత్‌ నిర్మాణ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి, కృష్ణమూర్తి, మాచర్ల సంతోష్‌, సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.

మద్యానికి బానిసై   యువకుడు ఆత్మహత్య1
1/1

మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement