ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డార్ఫ్
ఆసిఫాబాద్అర్బన్: ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ అని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్–జెట్టి ఎలిజెబెత్ దంపతుల వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్, ఐటీడీఏ పీవో యువరాజ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గిరిజన సంఘాల నాయకులతో కలిసి హైమన్ డార్ఫ్–జెట్టి ఎలిజెబెత్, కుమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డార్ఫ్ దంపతుల స్ఫూర్తితో ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. ఆదివాసీలపై అధ్యయన కోసం వారు మార్లవాయి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారన్నారు. వారు నివసించిన ఈ ప్రాంతం ఎంతో చారిత్రాత్మకమన్నారు. యువత, గిరిజనులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం హైమన్ డార్ఫ్–జెట్టి ఎలిజెబెత్ దంపతుల పేరిట స్మృతివనం ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిందన్నారు. వారు గిరిజనులతో మమేకమై ఆదివాసీల చైతన్యం కోసం కృషి చేశారన్నారు. డార్ఫ్..మానవ పరిణామ పర్యావరణ వేత్త, గొప్ప శాస్త్రవేత్త అని తెలిపారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ హైమన్ డార్ఫ్ దంపతులు మహానీయులని కొనియాడారు. మార్లవాయి అనేది ఒక ప్రాంతం కాదని, ఇది ఒక పవిత్ర స్థలమన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ రాయిసెంటర్ల ఏర్పాటు, గిరిజనుల్లో పటేళ్ల వ్యవస్థ బలోపేతం చేయడంలో డార్ఫ్ దంపతులు కృషి చేశారన్నారు. మార్లవాయి ప్రాంత అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైనూర్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్లు విశ్వనాథ్, ఇరుకుల మంగ, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, డీటీడీవో రమాదేవి, మార్లవాయి సర్పంచ్ కనక ప్రభావతి, రాజ్గోండ్ సేవాసమితి ప్రతినిధి సిడాం అర్జు, రాయిసెంటర్ జిల్లా మేడి కుర్సింగ మోతీరాం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డార్ఫ్


