● పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న పంటలకు జీవం
● జిల్లాలో సగటున 37.1 మి.మీ వర్షపాతం
కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో సాగు చేసిన పత్తిపంట
మహబూబ్నగర్ (వ్యవసాయం): వర్షం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతకు అల్పపీడన ప్రభావంతో కురిసిన వాన ఊరటనిచ్చింది. జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలతో వాడుముఖం పట్టిన పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న పంటలకు తేమ అందింది. పూత, కాత దశలో ఉన్న పత్తికి ఈ వర్షం కీలకంగా మారింది. సోమవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 37.1 మి.మీ వర్షపాతం నమోదైంది.
పంటలకు ఊపిరి
20 రోజులుగా సరైన వర్షం లేక భూమిలో తేమ తగ్గడంతో పలు ప్రాంతాల్లో పంటలు వాడుముఖం పట్టాయి. తాజాగా కురిసిన వానతో పొలాల్లో తేమ పెరిగి పంటలు పచ్చబడుతున్నాయి. ఎరువులు వేసేందుకు, అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్లో 4.05 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.92 లక్షల ఎకరాల్లో సాగైంది.
చెరువులకు చేరని నీరు
భారీ వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలే దు. వర్షాధార రైతులు ఇబ్బందులు పడుతుండగా.. బోర్లు, ఇతర సాగునీటి వనరులున్న రైతు లు పంటలను కొనసాగిస్తున్నారు. మరో రెండు రోజులపాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కు రిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మిడ్జిల్లో అత్యధికం
ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు జిల్లాలో సగటున 37.1 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. మిడ్జిల్ 54.4, నవాబుపేట 54.2, అడ్డాకుల 48.4, రాజాపూర్ 48.4, బాలానగర్ 47.8, జడ్చర్ల 46.7, హన్వాడ 41.9, కౌకుంట్ల 41.6, దేవరకద్ర 40.6, కోయిలకొండ 37.1, గండీడ్ 32.9, మహబూబ్నగర్ అర్బన్ 28.8, మూసాపేట 25.6, చిన్నచింతకుంట 23.6, మహబూబ్నగర్ రూరల్ 22.1, భూత్పూర్ 19.4, మహ్మదాబాద్ 18 మి.మీ వర్షపాతం నమోదైంది. ముసురు వానలతో వరి, ఆరుతడి పంటలకు ప్రయోజనం చేకూరనుంది.


