అడ్డాకుల/భూత్పూర్: వరి ధాన్యం కొనుగోళ్లను అధికారులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శనివారం ఆమె మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి, భూత్పూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ హరిప్రియతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన తేమ శాతం ఉండేలా చూసుకుని రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అధికారులతో ఆరా తీశారు. రహదారుల వెంట ఉన్న వరి కుప్పలను ముందుగా కొనుగోలు చేసి ఐదారు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అకాల వర్షాల నుంచి రక్షించేందుకు తగినన్ని టార్ఫాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. డీఎస్ఓ శ్రీనివాస్, పౌరసరఫరాల సంస్ధ డీఎం రవినాయక్, తహసీల్దార్ రాజునాయక్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ మమత, ఎంపీడీఓ ఉమాదేవి, ఆర్ఐ వెంకటేష్, జీపీఓ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య ఉన్నారు.


