రెండు, మూడు రోజుల్లో వరి కొనుగోళ్లు ప్రారంభిస్తారని నేను, నా తమ్ముడు కలిసి ఐదు ట్రాక్టర్ల ధాన్యం యార్డుకు తీసుకువచ్చాను. వర్షం రావటంతో ఆరబెట్టిన ధాన్యం వరద నీళ్లలో కొట్టుకుపోయింది. నాతో పాటు చాలా మంది రైతులు ఇదే పరిస్థితి. మక్కలు అయితే చాలా రోజుల నుంచి వచ్చి కొనకపోవటంతో వరదనీటిలో కొట్టుకుపోయి తడిసి ముద్దయ్యాయి. తడిసిన మక్కలు, వరిని కొనుగోలు చేయాలి.
– భీమాస్వామి, గంగాపురం, జడ్చర్ల
మార్కెట్కు 1వ తేదీ తెచ్చాను..
యార్డుకు ఐదు ట్రాక్టర్ల మక్కలు మే 1వ తేదీ తీసుకొచ్చాను. గన్నీ బ్యాగ్లు లేవని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టారు. నేనే సొంతంగా బయట గన్నీ బ్యాగ్లు తెచ్చి మక్కలు నింపి పెడితే.. ఈ రోజు కొనడానికి వచ్చారు. వేలిముద్ర రావడం లేదని వెళ్లిపోయారు. తీరా సాయంత్రం వర్షం వచ్చి ధాన్యం తడిసింది. ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలి. – సుధాకర్, కోడ్గల్
రైతులకు న్యాయం జరగడం లేదు
అమ్మబోతే అడవి.. ఆరబెట్టబోతే అధోగతి అన్న విధంగా ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాకు కిలో చొప్పున కట్ చేస్తూ మిల్లర్లు దగా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేక తూకం సకాలంలో వేయక ఎన్నో అవస్థలు పడుతూ ధాన్యాన్ని అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వర్షం రావడంతో తడిసి ముద్దయింది. ఎంత నష్టం జరిగిందో తెలియదు. రైతులకు న్యాయం జరగడం లేదు.
– అంజిలయ్య, రైతు, మహమ్మదాబాద్
●


