
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
పాలమూరు: జిల్లాలో ఈ ఏడాది మార్చి 8న నిర్వహించిన లోక్ అదాలత్లో 17,431 కేసులు రాజీ చేశామని, అలాగే వచ్చే నెల 14న నిర్వహించే లోక్ అదాలత్లో ఇంకా ఎక్కువ స్థాయిలో కేసులు రాజీ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కోసం మహబూబ్నగర్ కోర్టులో ఆరు బెంచీలు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లోక్ అదాలత్ కోసం ఇప్పటికే కొంత మంది కక్ష్యిదారులను గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలతోపాటు ఇతరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రధానంగా పోలీస్ శాఖ కేసులు అధికంగా రాజీ అయ్యేలా కీలక పాత్ర పోషిస్తుందని, కోర్టుకు పోలీసులు బాగా సహకరిస్తున్నారని చెప్పారు. రాబోయే లోక్ అదాలత్లో అధికంగా కేసులు రాజీ కావడానికి పోలీసులు ఎక్కువగా దృష్టిపెట్టాలని కోరారు. ఫ్రీ లిటిగేషన్ కేసులు, క్రిమినల్, విద్యుత్, భూ పంచాయితీ, రోడ్డు ప్రమాద కేసులు, వివాహం కేసులు, బ్యాంకు, సివిల్, క్రిమినల్, ఎంవీఐ యాక్ట్, డ్రంకెన్ డ్రైవ్, చెక్ బౌన్స్ ఇలా రాజీ కావడానికి అవకాశం ఉన్న ప్రతి కేసును లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర తదితరులు పాల్గొన్నారు.
● జూన్ 14న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా బుధవారం జిల్లా కోర్టులో న్యాయమూర్తి పాపిరెడ్డి బ్యాంకుల మేనేజర్స్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. బ్యాంకు కేసుల సెటిల్మెంట్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులపై చర్చించారు. ఈసారి నిర్వహించే లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని, కక్ష్యిదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించారు.