
గోడ కూలి వ్యక్తి మృతి
గట్టు: మండల పరిధిలోని బల్గెర గ్రామంలో ఇంటి నిర్మాణంలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న గోడ కూలి పోవడంతో సంక ఏబేలు (38) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. బల్గెరకు చెందిన సంక ఏబేలు అదే గ్రామానికి చెందిన బోయ నర్సింహులుకు చెందిన ఇంటి నిర్మాణ పనులకు వెళ్లాడు. పాత గోడపై కొత్తగా ఇటుక పెల్లతో నిర్మాణం చేస్తున్న క్రమంలో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఏబేలు (38) తీవ్రంగా గాయపడగా అయిజలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య సువార్తమ్మతో పాటుగా ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుని తండ్రి సంక దేవదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు.
అనుమానాస్పదంగావ్యక్తి మృతి
అచ్చంపేట రూరల్: అనుమానస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కొత్తతాండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఐనోల్ గ్రామం కొత్తతాండకు చెందిన మాయని శ్రీశైలం (36) శ్రీశైలం మద్దిమడుగు ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ జీవించేవాడు. మద్యానికి బానిస కావడంతో మొదటి భార్య రజిత విడిగా ఉంటుంది. ఈ క్రమంలో శ్రీశైలం మద్దిమడుగుకు చెందిన విజయలక్ష్మిని రెండో వివాహం చేసుకోగా వీరికి ఐదు నెలల పాప ఉంది. ఈనెల 11న శ్రీశైలం తల్లి వెంకటమ్మ కుమారుడి ఇంటికి వెళ్లింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచింది. ఇంటి తలుపు పగులగొట్టి చూడగా శ్రీశైలం తీవ్ర రక్తగాయాలతో చనిపోయి ఉన్నాడు. భార్య కూడా కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యా దు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు.
ధని యాప్ పేరుతో రూ.4.12 లక్షల మోసం
ఉండవెల్లి: మండలంలోని కలుగోట్ల గ్రామానికి చెందిన కుర్వ మహేష్ ధని యాప్ పేరిట ఆన్లైన్లో 4 విడతల్లో అకౌంట్లోకి రూ.4,12,884 నగదు పంపించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలుగోట్ల గ్రామానికి చెందిన కుర్వ మహేష్కు ఫేస్బుక్లో మార్చి 31న ఆన్లైన్లో ధని యాప్ ద్వారా లోన్ ఇస్తామని రావడంతో వెంటనే క్లిక్ చేశారు. అదే యాప్ ద్వారా ఏప్రిల్ 1న మరొక వ్యక్తి ఫోన్ చేసి లోన్ ప్రాసెస్ గురించి వివరించాడు. దీంతో ప్రాసెసింగ్ ఫీజు కింద ఒకసారి రూ.2 వేలు, మరోసారి రూ. 10 వేలను ఆన్లైన్లో చెల్లించాడు. ఏప్రిల్ 3న మరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి ఎంత భూమి ఉందని అడగడంతో 2 ఎకరాలు ఉందని మహేష్ తెలిపాడు. దీంతో అపరిచిత వ్యక్తి రూ.80 లక్షల లోన్ వస్తుందని, రిజిస్ట్రేషన్కు ఫీజు చెల్లించాలని తెలపడంతో మొత్తం రూ.26,789 నగదును ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు వెల్లడించారు. అలా వివిధ అకౌంట్లకు మొత్తం నాలుగు విడుతలలో రూ.4,12,884ను ఆన్లైన్లో చెల్లించాడు. మరుసటి రోజు తనకు కాల్స్ వచ్చిన నంబర్లకు తిరిగి ఫోన్ చేయడంతో స్విచ్ఛాప్ అని రావడంతో.. తాను మోసపోయానని గ్రహించిన మహేష్ ఉండవెల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైబర్క్రైం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.
బాధిత కుటుంబీకుల
ఆందోళన
జడ్చర్ల టౌన్: పట్టణంలోని కావేరమ్మపేటలో విద్యుదాఘాతంతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం మృతుల కుటుంబీకులు, గ్రామస్తులు స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒక్కో కుటుంబానికి రూ. 20లక్షల పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా ఈ విషయమై విద్యుత్ అధికారులు, సదరు కాంట్రాక్టర్తో చర్చలు జరిపారు. కాంట్రాక్టర్ ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు రాగా.. కనీసం రూ. 20లక్షల చొప్పున ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పోలీస్స్టేషన్లో గంటల తరబడి చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆందోళనకారులు 167వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఘటనకు కారణమైన లైన్మన్ నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు. విషయాన్ని కొందరు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. అయితే ఎమ్మెల్యే చొరవతో ఒక్కో కుటుంబానికి రూ. 15లక్షలు ఇచ్చేలా కాంట్రాక్టర్, లైన్మన్ అంగీకరించారు. అదే విధంగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో కుటంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూస్తామన్నారు. దీంతో ఆందోళన విరమించారు.

గోడ కూలి వ్యక్తి మృతి