హార్వెస్టర్లో పడి బాలుడు దుర్మరణం
మల్దకల్: పంట పొలంలో మొక్కజొన్న కోసే హార్వెస్టర్లో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతి చెందినట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. వివరాలు.. మండలంలోని నీలిపల్లికి చెందిన అఖిల, రాజు దంపతుల కొడుకు జీవన్కుమార్(7). తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాజు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను కోసేందుకు హార్వెస్టర్ రావడంతో కుటుంబసభ్యులతో కలసి వెళ్లాడు. అక్కడ హార్వెస్టర్ డ్రైవర్ సుభాష్రెడ్డి మొక్కజొన్న కోసే క్రమంలో అక్కడే ఆడుకుంటున్న జీవన్కుమార్ను గమనించలేదు. బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. గమనించిన డ్రైవర్ హార్వెస్టర్లో పడిన బాలుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అప్పటికే బాలుడు మృతిచెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం
మల్దకల్: ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని అడివిరావల్చెర్వులో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయ నాగరాజు (34) ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల కడుపునొప్పితో పాటు ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాగరాజుకు భార్య జయలక్ష్మి, ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మహమ్మదాబాద్: రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గండేడ్ మండలంలోని కొంరెడ్డి గ్రామానికి చెందిన వెంకటయ్య(58) పొలం పనులు ముగించుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన గ్రామస్తులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై వెంకటయ్య కుమారుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ వైర్లకు నిచ్చెన తాకడంతో..
వనపర్తి రూరల్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని చిమనగుంటపల్లిలో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చిమనగుంటపల్లికి చెందిన శివయ్య(50) శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలోని రామాలయంలో పనులు చేస్తున్నాడు. ఇనుప నిచ్చెనను తీసుకెళ్తున్న క్రమంలో ఆలయంలో వేలాడుతున్న కరెంట్ వైర్లకు నిచ్చెన తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ విషయంపై వనపర్తి రూరల్ ఎస్ఐ జలెందర్రెడ్డిని వివరణ కోరగా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆలయంలో కరెంటు వైర్లు కిందికి వేలాడుతున్నాయని అధికారులకు గ్రామస్తులు విన్నవించగా కొత్త కరెంటు స్తంభాలు నిలబెట్టారు. కానీ వైర్లు పైకి లాగకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
చికిత్స పొందుతూ
మరొకరు..
అచ్చంపేట రూరల్: పట్టణంలోని ప్రభు త్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువా రం గుర్తు తెలియని వ్యక్తి(65) మృతిచెందాడు. అచ్చంపేట ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. గత నెల 31న పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గమనించిన ప్రయాణికులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తిని ఎవరైనా గుర్తు పడితే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
రూ.1.50 లక్షలు చోరీ
మక్తల్: గుర్తుతెలియని వ్యక్తులు రూ.1.50 లక్షలు చోరీ చేసిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు.. మాగనూర్ మండలం నేరెడుగాం గ్రామానికి చెందిన సంకానూర్ నాగప్ప పట్టణంలోని బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసుకొని తన సొంత ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంకు కవరులో పెట్టాడు. పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్కు వెళ్లి వచ్చేలోగా డబ్బులు కనిపించపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిశీలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
హార్వెస్టర్లో పడి బాలుడు దుర్మరణం


