అమరచింత: జూరాల బ్యాక్వాటర్లో దూకి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్కు చెందిన వామనరావు కుమారుడు వినయ్కులకర్ణి(25) హైదరాబాద్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతనికి రెండు నెలల క్రితమే పెద్దలు ఓ యువతితో వివాహం జరిపించారు. అయితే స్వగ్రామం బీజాపూర్కు వచ్చిన వినయ్ హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి శుక్రవారం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలోనే తండ్రి వామన్రావుకు ఫోన్ చేసి తాను జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆయన జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకుని గాలించగా 17వ నంబర్ షెటర్ వద్ద బైక్, ల్యాప్టాప్, సెల్ఫోన్ కనిపించాయి. విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో.. ఎస్ఐ సురేష్ జాలర్లతో కలిసి బ్యాక్వాటర్లో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల తర్వాత సోమవారం వినయ్ మృతదేహం బ్యాక్వాటర్లో తేలడంతో జాలర్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఆత్మకూర్లోని శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై వినయ్ తండ్రి వామనరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
పెళ్లయిన రెండు నెలలకే..
వినయ్ కులకర్ణి పెళ్లయిన రెండు నెలలకే ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బంధువులు పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించడం, లోలోపల కుంగిపోయేవాడని పేర్కొన్నారు. అయితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు దాపురించిందో అర్థం కావడం లేదని తండ్రి వామనరావు రోదిస్తూ చెప్పారు.
మూడు రోజుల క్రితం బైక్, ల్యాప్టాప్ లభ్యం
తాజాగా ప్రాజెక్టులో లభ్యమైన మృతదేహం