మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్ డోలి సంధ్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్, కేసముద్రం రోడ్డు వద్ద జరిగిన ఆందోళన సందర్భంగా అటువైపుగా వెళ్తున్న కలెక్టర్ స్నేహశబరీష్ వాహనాన్ని కుటుంబ సభ్యులు ఆపి వారి బాధను వ్యక్తం చేశారు. తీవ్రబాధలో ఉన్న డోలి సంధ్య తమ్ముడు డోలి రాజేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు వెలుగు శ్రావణ్, మేక వెంకటేష్, బోనగిరి మధు, మునగాల మహేష్, కేలోత్ సాయికుమార్, గుగులోత్ సూర్యప్రకాష్, బానోత్ సింహాద్రి మాట్లాడుతూ ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్ డోలి సంధ్య మరణించి నేటికి 16 రోజులు కావొస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల అలసత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఆమె మృతికి కారకుడైన మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ తేజావత్ శ్యామ్ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని వారు డిమాండ్ చేశారు. నిందితుడు శ్యామ్ కు రాజకీయ అండదండలు ఉండడం వల్లనే పోలీసులు ఈ కేసును నిర్లక్ష్యం చేస్తున్నారన్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు, పద్మ, స్వాతి, విద్యార్థి సంఘాల నాయకులు జలగం ప్రవీణ్, చిలువేరు వికాస్, గుడిబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనాల అడ్డగింత..
ఆందోళనలో భాగంగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు అటువైపుగా వెళ్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు.
రోడ్డుపై బైఠాయింపు, ఎమ్మెల్యే,
ఎమ్మెల్సీ, కలెక్టర్ వాహనం అడ్డగింత
సంధ్య తమ్ముడు రాజేష్
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం


