డీబీఎం–48 కాల్వ
ప్రవహించే ప్రాంతాలు..
డోర్నకల్: డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(ఎస్సారెస్పీ) కాల్వల పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన నిర్వహణ లేక చాలా ప్రాంతాల్లో కాల్వలు కనుమరుగవుతున్నాయి. కాగా, డీబీఎం–48 కాల్వ వరంగల్, మహబూబా బాద్ జిల్లాల్లో వ్యవసాయానికి జీవనాడి లాంటిది. సుమారు 1.43 లక్షల ఎకరాలకుపైగా సాగు నీరందించేందుకు నిర్మించిన డీబీఎం–48కాల్వ కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకు అందని నీరు..
తీగరాజుపల్లి వద్ద ప్రారంభమయ్యే డీబీఎం–48 కాల్వ డోర్నకల్ మండలంలోని వెన్నారం శివారు మున్నేరువాగు వద్ద ముగుస్తుంది. ఎగువ ప్రాంతా ల్లో కాల్వలు చెట్లు, పిచ్చి మొక్కలతో పూడుకుపోవడం, కాల్వలకు గండ్లు పడడం, ఆక్రమణకు గురి కావడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. చాలా ప్రాంతాల్లో కాల్వల లైనింగ్ ధ్వంసమైంది. కాల్వలకు గండ్లు పడిన సమయంలో మరమ్మతుల కోసం ఆ ప్రాంతాలకు చేరుకునేందుకు కాల్వకు ఇరు పక్కలా 22 నుంచి 55 అడుగుల స్థలంలో దారి నిర్మించారు. అయితే చాలా ప్రాంతాల్లో దారిని పూర్తిగా ఆక్రమించారు. రైతులు కాల్వకు ఇరుపక్కలా దారిని ఆక్రమించి దున్నేయడంతో కాల్వ ప్రమాదకరస్థాయిలో ఉంది. దీంతో ఈ ప్రాంత రైతులు వ్యవసాయ బావులు, చెరువులు, మున్నేరు, ఆకేరు వాగులపైనే ఆధారపడుతున్నారు.
వర్షాభావ పరిస్థితులు..
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒక్క పంట కూడా సాగు చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే ఎగువ ప్రాంతంలో నీటి నిల్వల ఉన్న సమయంలో డీబీఎం–48 కాల్వ ద్వారా జోన్లవారీగా షెడ్యూల్ ప్రకారం ఎనిమిది నెలల పాటు 15 రోజులకోసారి నీటిని వరుసగా మూడు నుంచి నాలుగు రోజుల పాటు విడుదల చేసేవారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో సరిపడా నీటి నిల్వలు లేకపోవడంతో డీబీఎం–48 కాల్వకు నీరు విడుదల కావడం లేదు. డీబీఎం–48 కాలువ కింద కురవి మండలంలో 23 వేల ఎకరాలు, డోర్నకల్ మండలంలో 18 వేల ఎకరాలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, అధికారులు స్పందించి కాల్వల ఆక్రమణలు గుర్తించి ఆక్రమణ స్థలాలను స్వాధీనపర్చుకోవాలని, గండ్లు పడిన ప్రాంతాలకు మరమ్మతులు చేయాలని, చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. నీటి నిల్వలు ఉన్న సమయంలో కాల్వకు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద కాకతీయ ప్రధాన కాల్వ నుంచి ప్రాంరభమయ్యే డీబీఎం–48 కాల్వ పర్వతగిరి, నెక్కొండ మండలాల మీదుగా ప్రవహించి మహబూబాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్, కురవి మండలాల మీదుగా డోర్నకల్ మండలం వెన్నారం వరకు ప్రవహించి సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ భూములకు సాగునీరందిస్తుంది. ప్రతీ ఏటా ఎస్సారెస్పీ కాల్వ ద్వారా వానాకాలం, యాసంగి పంటలకు నీరందించేందుకు చెరువులను నీటితో నింపుతున్నారు.
మరమ్మతులకు నోచుకోని
ఎస్సారెస్పీ కాల్వలు
చెట్లు, పిచ్చి మొక్కలతో కనుమరుగు
కొన్ని చోట్ల ఆక్రమణకు గురైన వైనం


