నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాక

Aug 31 2026 1:20 AM | Updated on Aug 31 2026 1:20 AM

కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సోమవారం రానున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సభాప్రాంగణంతో పాటు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. కేసముద్రంవిలేజ్‌లో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రారంభోత్సవం, మున్సిపాలిటీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన, నారాయణపురం గ్రామ రైతులకు పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, ఇనుగుర్తి, సీరోలు, దంతాలపల్లి మండల కేంద్రాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల నిర్మాణానికి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

ఆయిల్‌పామ్‌ రైతుల

గోస పట్టని ప్రభుత్వం

తొర్రూరు: ఆయిల్‌పామ్‌ రైతుల కష్టాలు తీర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఉంచిన ఆయిల్‌పామ్‌ గెలలను ఆదివారం మాజీ మంత్రి దయాకర్‌రావు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. వంట నూనెల లోటు పూడ్చేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ పంటను ప్రోత్సహించిందని, దీని కోసం తొర్రూరు శివారు గోపాలగిరిలో పరిశ్రమను మంజూరు చేయించామన్నారు. అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి రూ.100 కోట్లు సైతం కేటాయించామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశ్రమ పనులు ప్రారంభించడంలో అలసత్వం వహిస్తోందన్నారు. నర్సరీలో నాణ్యత లేని మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, దానిపై స్పష్టతనివ్వడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఆయిల్‌పామ్‌ సాగు రైతుల మార్కెటింగ్‌ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని, దానిలో భాగంగానే పరిశ్రమ పనులను అటకెక్కిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, కౌన్సిలర్‌ తూర్పాటి రవి, నాయకులు కుర్ర శ్రీనివాస్‌, ధరావత్‌ జైసింగ్‌, రాయిశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శంకర్‌నాయక్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలన విఫలంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 2న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, 3న వ్యవసాయ విధ్వంసంపై నిరసన, 4న మహిళలకు రూ.2500, కేసీఆర్‌ కిట్స్‌ తదితర విషయాలపై వంటావార్పు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 5న పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, తదితర అంశాలపై ర్యాలీలు ఉంటాయన్నారు. 7న మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమంలో 420 హామీల అమలుపై వినతులు ఇస్తామన్నారు. 8న వారం రోజుల నిరసన కార్యక్రమాలపై ప్రెస్‌మీట్‌, ఆతర్వాత అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతుల సమర్పించడం జరుగతుందని తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నారాయణపురం రైతుల విషయంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనే పట్టాలు ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ ఇచ్చి షో చేస్తుందన్నారు. సమావేశంలో నాయకులు నాయిని రంజిత్‌, ఫరీద్‌, లూనావత్‌ అశోక్‌, యాకూబ్‌రెడ్డి, తేళ్ల శ్రీను, నరేష్‌, ఆవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

‘బొగత’ అదుర్స్‌

వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement