● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
కేయూ క్యాంపస్ : కృత్రిమ మేధస్సు (ఏఐ)యుగంలోనూ మానవ భావోద్వేగాలకు ప్రత్యామ్నాయం లేదని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో ‘న్యూలిటరరీ అండ్ లాంగ్వెజ్ హారిజన్స్ వాయిసెస్ జెనరస్ అండ్ టెక్నాలజీస్’ అనే అంశంపై రెండు రోజులుగా సెనెట్హాల్లో నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం సాయంత్రం ముగిసింది. రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 21వ శతాబ్దంలో ఆంగ్ల భాష ప్రపంచీకరణ, డిజిటలీకరణ, కృత్రిమ మేధస్సు యుగానికి ప్రధాన మాధ్యమంగా నిలిచిందన్నారు. అనంతరం శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శారదతల్లం మాట్లాడుతూ చాట్జీపీటీ అధ్యాపకులకు ప్రత్యామ్నాయం కాదన్నారు. ఈబుక్స్, ఆడియోబుక్స్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్తో సాహిత్య అనుభవం రూపాంతరం చెందినా మానవ భావోద్వేగాలు, సృజనాత్మకతకు ఏఐ ప్రత్యామ్నాయం కాదన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఇంగ్లిష్ విభాగం అధిపతి మేఘనారావు మాట్లాడుతూ ఈజాతీయ సదస్సులో 90 పరిశోధన పత్రాలు సమర్పించారని, 6 సాంకేతిక సెషన్లు, రెండు ప్యానల్ చర్చలు నిర్వహించినట్లు తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు ఎం. నవీన్, దీపాజ్యోతి పాల్గొన్నారు.
సాహిత్యం.. ఉన్నత విద్యకు కీలకం
కాగా, మొదటి రోజు సదస్సులో కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాహిత్యం, భాష, సాంకేతికత సమన్వయం ఉన్నత విద్యకు కీలకమన్నారు. భారతీయ కథన సంప్రదాయంలో పంచతంత్ర కథలు విశిష్ట స్థానం పొందాయని ములుగు సమ్మక్క, సారక్క గిరిజన కేంద్ర యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ వైఎల్ శ్రీనివాస్ అన్నారు. సాహిత్యం, సాంకేతికత కలయికతో రచయితత్వం పాఠకత్వరూపంలో గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయని విక్రమ సింహపురి యూనివర్సిటీ మాజీ వీసీ సీఆర్ విశ్వేశ్వర్రావు అన్నారు.


