మహబూబాబాద్: పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘నక్ష ప్రాజెక్ట్’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 10 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా దానిలో మానుకోట మున్సి పాలిటీ ఉంది. ఈ మేరకు ప్రాజెక్ట్లో ఆర్ఓఆర్ న మోదు కార్యక్రమాన్ని ఇటీవల అధికారులు ప్రారంభించారు. ఇందులో ప్రధానం ఉద్ధేశ్యం ప్రాంతాలను ఖచ్చితమైన డిజిటల్ భూ రికార్డులను సృష్టించడం, స్పష్టమైన ఆస్తి యాజమాన్యాన్ని నిర్ధారించడం, యాప్లో గృహాలు, వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, స్థలాలు, రోడ్లు, ఇతర అన్ని వివరాలు ఇందులో నమోదు అవుతాయి.
మానుకోటలో 65,712 మంది ఓటర్లు..
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉండగా విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా పట్టణంలో ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. సుమారు 23,200 గృహాలు ఉన్నాయి. 2024–25 సంవత్సరంలో నక్ష ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉండగా మున్సిపల్ ఎన్నికలు, పన్నుల వసూలు తదితర కారణాలతో ఆలస్యమైంది. ముందుగా ఆరు నెలల పాటు ల్యాండ్ సర్వే విభాగం ద్వారా డ్రోన్ కెమెరాల ద్వారా ఫొటోల చిత్రీకరణ పూర్తి చేశారు. అనంతరం సర్వేయర్లు అన్ని గృహాల వివరాలు నమోదు అయ్యాయా? లేదా అని తెలుసుకోవడం కోసం గ్రౌండ్ ట్రూతింగ్ (రియాల్టీ కోసం) చేసి కమిషనర్ లాగిన్కు పంపారు.
మొదటి విడతలో 17 వార్డులు..
మొదటి విడతలో మానుకోటలో 17 వార్డులు ఎంపిక చేశారు. వాటిని 203 బ్లాక్లుగా చేశారు. వాటిలో డ్రోన్ కెమెరాతో తీసిన అన్ని ఫొటోలు, గృహాల, వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, రోడ్లు ఉంటాయి.
ఆర్ఓఆర్లో నమోదు
డిజిటలైజేషన్లో భాగంగా మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్లు ఆర్ఓఆర్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఈనెల 12న మానుకోట పట్టణంలోని హైమా గార్డెన్లో వివరాల నమోదు ప్రారంభమైంది. ఆ యాప్లో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన అన్ని ఫొటోలు ఉంటాయి. వాటి ఆధారంగానే ఇంటి యజమాని పేరుతో పాటు ఆధార్ నంబర్, ఇంటి హద్దులు, విస్తీర్ణం, డాక్యుమెంట్స్ ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 31వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి.
ఆర్ఓఆర్కు సహకరించాలి
ఆర్ఓఆర్ నిమిత్తం వచ్చే సిబ్బందికి ప్రజలు అన్ని విధాలా సహకరించాలి. ఆస్తులు ఇతర వివరాలు డిజిటలైజేషన్ అవుతాయి. దీంతో అక్రమాలకు చెక్ పడుతుంది. అర్బన్ ప్రాపర్టీ కార్డుతో ఆస్తుల విషయంలో రక్షణ ఉంటుంది. డ్రోన్ కెమెరాలతో తీసిన తర్వాత సర్వేయర్లు గ్రౌండ్ ట్రూతింగ్ చేసి వాటి ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారు.
– ఎం.వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్
30 రోజుల పాటు డ్రాప్ట్
ఆర్ఓఆర్ పూర్తి చేసిన తర్వాత దానిని మున్సిపాలిటీ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై డ్రాప్ట్ను ప్రదర్శిస్తారు. దానిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేసే అవకాశం కల్పిస్తారు. అనంతరం తుది జాబితాను అర్బన్ ప్రాపర్టీ కార్డు అందజేస్తారు. డిజిటలైజేషన్తో ప్రభుత్వ భూములతోపాటు రోడ్డులు, ఇతర కబ్జాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.
‘ఆర్ఓఆర్’ యాప్లో నమోదు
జూలై 31వ తేదీ వరకు గడువు
పైలట్ ప్రాజెక్ట్గా
మానుకోట మున్సిపాలిటీ ఎంపిక
డ్రాఫ్ట్ ప్రదర్శన అనంతరం తుది జాబితా


