మహబూబాబాద్ రూరల్: జిల్లాకు ప్రత్యేకంగా నాబార్డ్ కార్యాలయం ఏర్పాటు చేయడం కీలక నిర్ణయమని, నాబార్డ్ ద్వారా జిల్లా నలుమూలలకు సమర్థవంతంగా సేవలు అందిస్తామని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయభా స్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలో నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (డీడీఎం) కార్యాలయాన్ని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ స్వాతి బల్లముడి, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ సాయిరామ్ చౌరి, వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ యాదగిరి, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర, జిల్లా సహకార అధికారి విజయకుమారి, డీహెచ్ఎస్ఓ మరియన్న, డీఐసీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి, డీవీఏహెచ్ఓ బి.కిరణ్, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
మన ఊరి బడిలోనే చదివిద్దాం..
గూడూరు: మండలంలోని గుండెంగ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆ ఊరి ప్రభుత్వ బడి బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ నెల 10 బుధవారం గ్రామసభ నిర్వహించారు. గుండెంగ ప్రభుత్వ బడిలోనే 5వ తరగతి వరకు చదివే పిల్లలను చదివించాలని, ప్రైవేట్ బడుల్లో చదివించొద్దని తీర్మానం చేశారు. మంగళవారం గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల వాహనాల నిషేధమనే బ్యానర్లు కట్టించారు. అనంతరం వచ్చిన పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులను నిలిపి, డ్రైవర్లకు గ్రామ పంచాయతీ తీర్మానం కాపీలను చూపారు. ప్రైవేటు బడిలో చదివే 6వ తరగతి ఆపై విద్యార్థులను మాత్రమే తల్లిదండ్రుల ఇష్టానుసారం తీసుకెళ్లాలని, 5వ తరగతిలోపు పిల్లలను పంపించమన్నారు. జీపీ తీర్మానం మేరకు ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందని సర్పంచ్ బోడ రాజమ్మ, మాజీ ఎంపీటీసీ బోడ కిషన్, వార్డు సభ్యులు గ్రామంలో చాటింపు వేయించారు.
నేడు భద్రకాళి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8.36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారుచేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరుగనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ పాల్గొననున్నారు. ఈమేరకు మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా రెండోరోజు మంగళవారం ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభానికి ధాన్యాధివాసం, శయ్యాదివాసాలు జరిపారు. కార్యక్రమంలో జారతి వెంకటేశ్వర్లు, విజయకుమార్ పాల్గొన్నారు.


