● సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి
గార్ల: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో సీపీఐ పార్టీ నిర్వహించే ఉద్యమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై పూర్తి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన శ్రీనివాసరావు, మండల కార్యదర్శి జంపాల వెంకన్న, కృష్ణమూర్తి పాల్గొన్నారు.


