కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో కుండె నరేశ్(32) అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో మృతుడి భార్య, అత్త, మామను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుండె నరేశ్ ఇదే గ్రామానికి చెందిన కంకల కుమారస్వామి, కళమ్మ దంపతుల కుమార్తె అనూషను 2014లో వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, కొంతకాలంగా నరేశ్ మద్యం సేవించడం, భార్యను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా ఇతర మహిళలతో సంబంధాలపై ఇరువురి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం(ఈనెల 15న) పోలీస్స్టేషన్లో ఆ కుటుంబానికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరిగి ఇంటికెళ్లే క్రమంలో భార్య,అత్త, మామతో నరేశ్ గొడవ పడ్డాడు. అనంతరం అదే రోజు రాత్రి అత్తింటికెళ్లి గొడవ పడుతుండగా, భార్య, అత్త, మామ.. నరేశ్ను రాడ్తో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈక్రమంలో మంగళవారం కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు.
● భార్య, అత్త, మామలే నిందితులు
● వివరాలు వెల్లడించిన పోలీసులు


