కురవి: తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు.. తమ ముద్దుల కొడుకును చూసుకుంటూ మురిసిపోయారు. అయితే, తోటి స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ ఉన్న ఆ బాలుడిని తాచుపాము కాటేసింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండిన ఘటన నేరడ శివారు ఎల్కచెట్టు తండా జీపీ పరిధి మంచ్యాతండాలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. తండాకు చెందిన బానోత్ మధు–అరుణల ఒక్కగానొక్క కొడుకు బానోత్ గగన్విహారి(7) కురవిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. అమావాస్య కావడంతో బాలుడు బడికి పోలేదు. ఇంటి వద్ద స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో రాతి గోడ సమీపంలో తాచుపాము కాటేసింది. తల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘బడికి పోతే బతికెటోడు బిడ్డా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.
పాముకాటుతో బాలుడి మృతి


