● ఏసీబీ దాడుల్లో ఎంపీడీఓ,
ఎంపీఓ పట్టుబడడంతో సంబురాలు
నర్సింహులపేట: ఎంపీడీఓ పెనుగొండ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అవినీతి అధికారుల పీడ పోయిందని, చాలా ఇబ్బంది పడ్డామని బీజేపీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్, బీఆర్ఎస్ మండల నాయకుడు బండి రమేష్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఎంపీడీఓ ఆఫీస్ పక్కన, అంబేడ్కర్ సెంటర్లో టపాసులు కాల్చారు. మాజీ ఉప సర్పంచ్ కర్ల నాగన్న, ఎండీ.మదార్ పాల్గొన్నారు.
ఉలిక్కిపడ్డ నర్సింహులపేట..
ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ యాకయ్య ఏసీబీ అధికారులకు పట్టుపడటంతో ప్రజలు, అధికారులు ఉలిక్కిపడ్డారు. మహబూబాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న పెనుగొండ రాధిక నర్సింహులపేట ఇన్చార్జ్ ఎంపీడీఓగా 10 నెలలుగా పని చేస్తున్నారు. ఎంపీఓ కిన్నెర యాకయ్య గతంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేసి బదిలీపై వెళ్లారు. పదోన్నతిపై ఎంపీఓగా నర్సింహులపేటకు వచ్చి కొన్ని నెలలు ఎంపీడీఓ పని చేసి ప్రస్తుతం ఎంపీఓగా ఉన్నారు. వీరు ప్రస్తుతం ఏసీబీ దాడిలో పట్టుపడ్డారు. ఇంతకు ముందు 2012 సంవత్సరంలో నర్సింహులపేట తహసీల్దార్గా పని చేస్తున్న అకుల సమ్మయ్య, 2017లో నర్సింహులపేట ఎంపీడీఓగా పని చేస్తున్న తాళ్ల ఉపేందర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.


