● చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్పర్సన్
నాగవాణి
మహబూబాబాద్ రూరల్ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి పేర్కొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, షేర్ ఎన్జీఓ సంయుక్తంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాలలు బడికి.. పెద్దలు పనికి, పలుగు పారవద్దు.. పలక బలపం ముద్దు అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ముఖ్యఅతిథిగా హాజరైన నాగవాణి మాట్లాడుతూ.. స్వర్గం బాల్యంలోనే ఉందని, ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తున్నా హోటళ్లు, ఇటుక బట్టీల్లో, ఇళ్లల్లో పిల్లలు మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది యసాడి చెన్నమల్లారెడ్డి మాట్లాడుతూ.. బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలతో ఎలాంటి పనులు చేయించినా నేరమని, అలా చేసిన వారికి జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తారన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ క్రాంతికుమార్, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై ఉమ, డోర్నకల్ సీడీపీఓ శ్రీలక్ష్మి, జేఆర్సీ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రావణి, షేర్ ఎన్జీఓ ప్రతినిధులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.


