దుగ్గొండి: బైక్ అదుపు తప్పిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రేకంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నీరటి వేణు(34) హనుమకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్ల వారుజామున విధులకు హాజరు కావడానికి బైక్పై వస్తున్నాడు. మార్గమధ్యలో గిర్నిబావి దగ్గర లోకేశ్వర మిల్లు సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీప్రసన్న, కుమారుడు విశ్వంత్, కుమార్తె మనస్విని ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు.
ప్రాణం తీసిన పగిలిన రోడ్డు..
గిర్నిబావి నుంచి నల్లబెల్లి వరకు నాలుగేళ్ల క్రితం డబుల్ రోడ్డు వేశారు. గిర్నిబావి నుంచి లోకేశ్వర మిల్లు వరకు సీసీ రోడ్డు వేశారు. అయితే 24 ఫీట్ల సీసీ మధ్యలో 100మీటర్లు దూరం వరకు ఆరు ఇంచుల వెడల్పుతో రోడ్డు పగిలింది. దీంతో రాత్రి వేళ పగిలిన రోడ్డు మధ్యలో ద్విచక్ర వాహనం టైరు ఇరుక్కొని పడిపోవడంతో వేణు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు బాగు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


