హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారంనుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని, ప్రతిరోజూ ప్రత్యేక పూలసేవ జరుగుతుందని ఈఓ రామల సునీత తెలిపారు. ఉగాదిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం 6గంటలకు ఐనవోలు రాధాకృష్ణశర్మ పంచాంగ శ్రవణం చేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా బుధవారం బ్యాండ్మేళం చిత్రం యూనిట్ దేవాలయాన్ని సందర్శించింది. హీరో హీరోయిన్ రోషన్, శ్రీదేవి, రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు సతీశ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాదిని పురస్కరించుకొని తెలంగాణ కుమ్మరి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రుద్వారపు కుమారస్వామి ఆధ్వర్యంలో కొత్త మట్టి కుండలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవునూరి రామ్మూర్తి, నాగరాజు, భాస్కర్, సంతోష్, సముద్రాల రాజ్కోటి, రమేశ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.


