
మొక్కుబడిగా భూ భారతి సదస్సులు
తొర్రూరు: జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో స్థానికంగా రూపొందించిన షెడ్యూల్ ఆధారంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. కాగా తహసీల్దార్ కార్యాలయాలు ఇష్టానుసారంగా షెడ్యూల్ రూపొందించాయి. సమస్యలు అధికంగా ఉండే మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో రెవెన్యూ సదస్సును కేవలం ఒక్క రోజులోనే ముగిస్తున్నారు. సదస్సుల నిర్వహణపై సమాచారం లేని అనేకమంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఒక రెవెన్యూ గ్రామం పరిధిలో మూడు, నాలుగు గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామం ఉన్నచోటే ఇతర గ్రామాల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో రెండు మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రజలు రెవెన్యూ గ్రామానికి వచ్చి దరఖాస్తులు అందజేస్తున్నారు.
సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం..
భూ భారతి సదస్సుల కారణంగా దాదాపు 8 ఏళ్ల తర్వాత గ్రామాలకు బృందాలు వస్తున్నాయి. అధికారులు తమ చెంతకే వస్తుంటే రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ, సదస్సుల సమాచారం మాత్రం వారికి చేరడంలేదు. గ్రామాల్లో చాటింపు, వాట్సాప్ ద్వారా సమాచారం పంపించామని అధికారులు పేర్కొంటున్నారు. కానీ గ్రామాల్లో వ్యవసాయాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు సదస్సుల గురించి చెప్పడంలో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ నెల రోజుల నుంచి సన్నద్ధం చేసినప్పటికీ వీరు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
మిగిలింది నాలుగు రోజులే..
రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 3న ప్రారంభమైన సదస్సులు 20వ తేదీతో ముగియనున్నాయి. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం అని చెప్పినప్పటికీ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. సదస్సులు పూర్తయిన తర్వాత దరఖాస్తుల విభజన చేయనున్నారు. ఇవే బృందాలు మళ్లీ ఆయా గ్రామాల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరిస్తాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారుల ఆదేశాలతో మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో మరోమారు అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 2
మండలాలు 18
రెవెన్యూ గ్రామాలు 288
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 6,546
ఒక్క రోజులోనే
ముగిస్తున్న అధికారులు
సమాచారం లేక దరఖాస్తులు
ఇవ్వలేకపోతున్న రైతులు