
వానాకాలం అరిగోస
చిన్నగూడూరు: ఏటా వానాకాలంలో మండల కేంద్రానికి పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి. మండలంలోని పగిడిపల్లి, గుండంరాజుపల్లి గ్రామాల నుంచి చిన్నగూడూరు మధ్య జిన్నెలవాగు ప్రవహిస్తోంది. వర్షం కురిసి వాగులో వరద పారితే ఆ రెండు గ్రామాల ప్రజల రాకపోకలు నిలి చిపోయి ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా పాలకులకు విన్నవిస్తూనే ఉన్నామని ఎవరూ స్పందించ డం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎమ్మె ల్యే రాంచంద్రునాయక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాగుపై వంతెన నిర్మించేలా కృషి చేయాలని కోరుతున్నారు.
దూర, వ్యయ భారం..
వర్షం వస్తే జిన్నెలవాగు దాటనీయని పరిస్థితి. ఆయా గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం ఉంది. అయితే వాగు ప్రవహించినప్పుడు మహబూబాబాద్ మండలంలోని కొత్తూరు, జంగిలిగొండ గ్రామాల మీదుగా మండల కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు తెలుపుతున్నారు. దూరం పెరగడంతో వాహనాలను కిరాయి తీసుకొని ప్రయాణించాల్సి వస్తోందని, దీంతో వ్యయభారం అవుందని ఇరు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వంతెన నిర్మిస్తే తమ ఇబ్బందులు తొలగుతాయని వారు వేడుకుంటున్నారు.
జిన్నెలవాగు ప్రవహిస్తే
మండల కేంద్రానికి రాకపోకలు బంద్
ఏటా రెండు గ్రామాల ప్రజలకు తిప్పలు
బ్రిడ్జి నిర్మించాలని వేడుకోలు