
ఆకట్టుకున్న రైతు దామోదర్రెడ్డి స్టాల్●
● నిజామాబాద్ రైతు మహోత్సవంలో ఏర్పాటు
● 17 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మూడురోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. వివిధ జిల్లాలకు చెందిన పలపలు పంటలు పండించే రైతులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సుభాష్ పాలేకర్ విధానంలో పూర్తిగా ప్రకృతి విధానంలో వ్యవసాయం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన రైతు గంట దామోదర్రెడ్డి ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. గంట దామోదర్రెడ్డి 1974లో బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేశారు. 1978 నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అయితే గత 17 ఏళ్లుగా సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 11 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మొదట 4 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టగా మొదట్లో అంతగా దిగుబడులు రాలేదు. తరువాత 3వ సంవత్సరం నుంచి దిగుబడులు వచ్చాయి. ప్రస్తుతం దామోదర్రెడ్డి 22 రకాల పసుపు పంట పండిస్తున్నారు. అదేవిధంగా వేరుశనగ, పప్పుదినుసులు, గోధుమ, జొన్న పండిస్తున్నారు. పసుపు, కంది, వేరుశనగ సాగులో సుభాష్ పాలేకర్ విధానంలో మల్చింగ్ షేడ్ వేస్తున్నారు. ఇక అతికష్టం మీద మెట్ట వరిలో సైతం మల్చింగ్ షేడ్ వేస్తున్నారు. ఇందుకు గాను జాతీయ అవార్డు సాధించారు. దామోదర్రెడ్డి ఉత్పత్తులకు వ్యవసాయ శాఖ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. దీంతో మార్కెటింగ్కు ఢోకా లేకుండా పోయింది. పసుపుతో క్యాన్సర్కు ఔషధం ఇస్తున్నట్లు దామోదర్రెడ్డి తెలిపారు.