రాత్రి వేళ తెలంగాణకు ఇసుకను తరలించడానికి జేసీబీతో టిప్పర్కు లోడ్ చేస్తున్న దృశ్యం, తెలంగాణకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక టిప్పర్లు
నందవరం: ఉచిత ఇసుక అంటూనే టీడీపీ నేతలు ఇసుకాసురులుగా అవతారమెత్తారు. తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారు. రాత్రి సమయాల్లో సరిహద్దులు దాటించి రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు.అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. నందవరం మండలంలో నాగలదిన్నె, గంగవరం గ్రామాల్లో రెండు ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. నాగలదిన్నె గ్రామానికి చెందిన నలుగురు టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెర తీశారు. రీచ్ను తలపించేలా నాగలదిన్నె గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, తుంగభద్ర నది ఒడ్డున వెలసిన సాయి బాబ ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలం ఇసుకను డంప్ చేసి రాత్రివేళ్లల్లో జేసీబీలతో తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. భారీ మొత్తంలో ఇసుకను నాగలదిన్నె వంతెన మీదుగా తెలంగాణాకు తరలిస్తున్నారు. జేసీబీలతో నదిలో ఇసుకను పోగుచేసి తీరంలో భారీ డంప్ ఉంచారు. అక్కడి నుంచి రాత్రి కాగానే టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. రోజుకు 10 నుంచి 15 ట్రిప్పుల ఇసుక అక్కడి నుంచి తరలుతున్నట్లు అంచనా.
నిద్రపోతున్న నిఘా
నదికై రవాడి, నాగలదిన్నె గ్రామాల సమీపంలోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడం లేదు. కనీసం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో కూడా తనిఖీలు లేవని తెలుస్తోంది. మైనింగ్, విజులెన్స్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో టీడీపీ నాయకుల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇసుక దందా చేస్తున్న
టీడీపీ నాయకులు
నాగలదిన్నె బ్రిడ్జి మీదుగా
రాత్రి సమయంలో తరలింపు
చర్యలు తీసుకోవడంలో
అధికారుల విఫలం


