కర్నూలు(హాస్పిటల్): పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కోరారు. జాతీయ పల్స్పోలియో కార్యక్రమాన్ని ఆదివారం కర్నూలు నగరంలోని ఎ.క్యాంపులో ఉన్న ఇందిరా గాంధి స్మారక మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేసి చిన్నారుల భవిష్యత్కు బంగారు బాటలు వేద్దామని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం మనందరి బాధ్యత అని అన్నారు. పల్స్పోలియో కార్యక్రమంలో వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,630 బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చ్కులు వేసేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్పోర్టులలో 52 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ ఎవ్వరైనా ఆదివారం పోలియో చుక్కలు వేసుకోలేకపోతే వారికి 29, 30వ తేదిల్లో ఇంటింటికి వచ్చి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, డీఐఓ డాక్టర్ ఉమ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


