● కలెక్టర్ ఆదేశాలతో
రంగంలోకి అధికారులు
ఆదోని: ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన ప్రభత్వ పాఠశాల స్థలం కబ్జా జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. ‘పచ్చ నోట్లకు రిజిస్ట్రేషన్’ పేరిట శనివారం వెలువడిన కథనం మీద జిల్లా కలెక్టర్ స్పందించారు. జెడ్పీ సీఈఓ రమణా రెడ్డిని రంగంలోకి దింపారు. ఆయన ఆదేశాల మేరకు ఆదోని మండల పరిషత్ అధికారి నాగరాజు స్వామి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజు, దొడ్డనగేరి పంచాయతీ సెక్రటరీ ధరణికుమార్తో పాటు జిల్లా విద్యాశాఖ కూడా విచారణలో భాగస్వాములయ్యారు. స్థానిక ఎంఈఓ ఇంద్రావతి, ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి కూడా విచారణలో పాల్గొన్నారు. అధికారులందరూ శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి భూమికి కొలతలు చేపట్టారు. ప్రభుత్వ రికార్డులు, పాఠశాల హద్దులు, రిజిస్ట్రేషన్ వివరాలను సరిపోల్చుతూ సమగ్ర నివేదికను ఇవ్వాలని కలెక్టర్ కోరారు. అయితే ప్రధానోపాధ్యాయుడు, పంచాయతీ సెక్రటరీ ఈ స్కూల్ స్థలం కబ్జా వ్యవహారంలో తెదేపా మండల నాయకుడు కురువ శివప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. విచారణ సందర్భంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన కొన్ని పాత రికార్డులు అందుబాటులో లేవని మండల పంచాయతీ సెక్రటరీ తన సన్నిహితుల దగ్గర చెబుతుండటంతో మరిన్ని అనుమానాలను గ్రామస్తులు వ్యక్త పరుస్తున్నారు.


