ఆత్మకూరురూరల్: వన్యప్రాణి చట్టం పట్ల అవగాహన లేక పోవడం, మూఢమ్మకాల కారణంగా కొంద రు వన్య ప్రాణుల ను పెంచుకుంటుంటారు. ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరం. నక్షత్ర తాబేలును తమకు మేలు కలుగుతుందనే మూఢ నమ్మకంతోనూ చట్టం పట్ల అవగాహన లోపంతో కర్నూలు నగరానికి చెందిన ఓ కుటుంబం కొంత కాలంగా నక్షత్ర తాబేలును పెంచుకుంటోంది. అది వారికి ఎలా లభ్యమైందో తెలియదు కానీ.. అలా పెంచుకోవడం సమస్యకు దారి తీస్తుందని మిత్రుల వల్ల వారు తెలుసుకున్నారు. అయితే ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియక కర్నూలు నగరానికి చెందిన సంఘమిత్ర అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన సభ్యులను సంప్రదించారు. ఆ సంస్థకు చెందిన ఇస్మాయిల్ తాబేలును గురువారం ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ (ప్రాజెక్ట్ టైగర్) విగ్నేష్ అపావ్కు అందించారు. దీంతో ఆయన తాబేలును బైర్లూటీలోని వైల్డ్ లైఫ్ డిస్పెన్సరి వైద్యులు వెస్లీకి అప్పగించి సంరక్షించాలన్నారు. వన్యప్రాణులను పెంచుకోవడం చట్ట రీత్యా నేరమని ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వైల్డ్ లైఫ్ డిస్పెన్సరి వైద్యులు డాక్టర్ వెస్లీ తెలిపారు. నక్షత్ర తాబేళ్లు అరుదైన వన్యప్రాణులని ఇవి ఇంటిలో ఉంటే అదృష్టమని కొందరు పెంచుకోవడానికి ఇష్ట పడుతున్నారని ఇది వాటి స్మగ్లింగ్కు కారణమవుతోందని అన్నారు. నక్షత్ర తాబేళ్లు నీటిలో నివసించవని అవి గడ్డి మైదానాల్లో ఉంటాయని అన్నారు. తమకు అందిన నక్షత్ర తాబేళు తన సహజ ఆహారపు అలవాటుకు దూరమైనందు వల్ల దాన్ని తిరిగి సహజ అలవాట్లకు మళ్ళించి ఆపై అడవిలో వదులుతామని ఆయన తెలిపారు.


