● ఏపీ స్కూల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ మువ్వా రామలింగం
కర్నూలు (సిటీ): జిల్లాలోని మోడల్ ప్రైమరీ స్కూళ్లన్నింటిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ స్కూల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ మువ్వా రామలింగం అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లాలోని ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలు, సమగ్ర శిక్ష ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 760 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయని, ఆ స్కూళ్లలో మౌలిక వసతులు సమకూర్చుకోవాలన్నారు. మన బడి – మన భవిష్యత్తు రెండో దశలో ఆగిపోయిన అన్ని స్కూళ్ల పనులు ప్రారంభించాలని, వాటికి కేటాయించిన మిగులు నిధులు వెంటనే ఖర్చు చేయాలన్నారు. ఆర్వో ప్లాంట్లు ఉన్న స్కూళ్లలో షెడ్యూల్ ప్రకారం మరమ్మతులు చేయడానికి సంబంధిత కంపెనీ వారు చర్యలు తీసుకునేలా ఆదేశించామన్నారు. పాఠశాలల్లో ఎక్కడైనా సెంట్రల్, ఈ–ప్రొక్యూర్మెంట్ మెటీరియల్స్ (డెస్క్, ఫ్యాన్, గ్రీన్ బోర్డు, ఆర్వో ప్లాంట్, ఐఏపీ ప్యానెల్స్) అవసరమున్న పాఠశాలలకు బదిలీ చేసుకోవాలని, ఈ పనులన్నిటినీ ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకోవడానికి ప్రణాళికలు రచించుకోవాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి ఎల్.సుధాకర్, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వి.లోకరాజ్, ఇంజనీరింగ్ అధికారులు, సెక్టోరియల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


