● ప్రత్యేకంగా నిలిచిన బేతంచెర్ల మెయిన్ ప్రాథమిక పాఠశాల
బేతంచెర్ల: విద్యా వికాసానికి చిరునామాగా, తరతరాల విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన బేతంచెర్ల మెయిన్ ప్రాథమిక పాఠశాల నేటికి ప్రత్యేకతను చాటుకుంటోంది. స్వాతంత్య్రానికి ముందే 1907లో ఈ పాఠశాల ప్రారంభమై, 119 ఏళ్లకు పైగా విద్యా సేవలను అందిస్తూ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానంను సంపాదించుకుంది. మండల కేంద్రమైన బేతంచెర్ల పట్టణంలో ఉన్న ఈ పాఠశాలలో 350 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మండలంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తింపు పొందింది. ఎన్నో దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల భవనాలకు మరమ్మతులు చేపట్టారు. తరగతి గదులను ఆధునీకరించారు. పాఠశాల ఆవరణాన్ని అందగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో పాఠశాల కొత్త రూపు సంతరించుకొని ఆకర్షణీయంగా మారింది. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఆట వస్తువులు, క్రీడా సామగ్రిని అందజేస్తూ విద్యతో పాటు క్రీడల అభివృద్ధి కి తోడ్పడుతున్నారు.
బేతంచెర్ల ప్రాథమిక పాఠశాలను 1907లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 350 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల అపూర్వ సేవలు అందిస్తోంది. ఇక్కడి ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రోత్సాహిస్తున్నాం.
– పాపారాయుడు, ప్రధానోపాధ్యాయుడు


