● సీఎం పర్యటనను నిరసిస్తూ
బార్ అసోసియేషన్ ఆందోళన
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి చంద్రబాబు కర్నూలుకు అన్యాయం చేశారని బార్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల అనంతరం ఆగస్టు 14వ తేదీన కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా చంద్రబాబు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును అమరావతికి తరలించి చంద్రబాబు కర్నూలుకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంను కలిసేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు కల్లబొల్లి మాటలు పక్కన పెట్టి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రుడు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు రాజేష్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఓంకార్, మాజీ ఉపాధ్యక్షుడు నిత్యజీవ రాజుతో పాటు న్యాయవాదులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.


