శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని బుధవారం చెంచులకు కల్పించారు. శ్రీశైలం ఐటీడీఏ వెలుగు ఏపీడీ పీక్లా నాయక్, ఎన్ఆర్ఈజీఎస్ ప్రాజెక్టు మేనేజర్ కె.జి.నాయక్, హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ బల్మూరి పరమేశ్ ఆధ్వర్యంలో పల్నాడు, నంద్యాల, మార్కాపురం జిల్లాల నుంచి 250 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చెంచు భక్తులతో పాటు ట్రస్ట్బోర్డు సభ్యురాలు గుల్లా గంగమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


