కూటమి సర్కారు మాటలకు చేతలకు పొంతన ఉండదు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో కిట్లు అందజేస్తామని హడావుడి చేసింది. తీరా అరకొర ఇచ్చి చేతులు దులుపుకుంది. తల్లికి వందనం పథకం కింద సాయమని గాలిలో దీపంగా మార్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేదల పిల్లలు చదువుతారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా అంటే అవి లేవు. కర్నూలు కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూలే ఇందుకు నిదర్శనం. బుధవారం ఈ పాఠశాల విద్యార్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్న భోజనం సమయంలో పలువురు విద్యార్థులు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు చేతపట్టుకొని బయటకు వెళ్లి నీళ్లు తెచ్చుకొని దాహం తీర్చుకున్నారు. ఆ విద్యార్థులతోనే టీచర్లు కూల్ వాటర్ క్యాన్లు తెప్పించుకోవడం గమనార్హం. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


