కోడుమూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో కొచ్చింది మొదలు టీడీపీ నాయకులు పెట్రేగిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ఎర్రమట్టి, ఇసుక తవ్వకాలు చేపడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కోడుమూరు మండలంలో కనుమరుగువుతున్న బైన్దొడ్డి తిప్పనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అనుమతులు లేనప్పటికీ కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ ఎర్రమటి తవ్వకాలు చేపడుతున్నారు. ఇందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
కొండ సగం మాయం!
పులకుర్తి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు, ఆయన అనుచరులంతా కలిసి అక్రమంగా ఎర్రమట్టి తరలింపుకు పాల్పడుతున్నారు. తరలించుకుపోయిన ఎర్రమట్టితో పవన్ విద్యుత్ కోసం ఏర్పాటు చేసే గాలిమరల కోసం పొలాల్లో రోడ్లు వేయడం, కర్నూలు వంటి ప్రాంతాల్లో వేసే వెంచర్లకు టిప్పర్ రూ.12వేల నుంచి రూ.15వేల చొప్పున అమ్ముకుంటూ రూ.లక్షలను అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇప్పటికే బైన్దొడ్డి కొండను సగానికి పైగా మాయం అయ్యింది. దీంతో కొండపై ఉన్న పొలాల పక్కనున్న ఎర్రమట్టిని కూడా తరలించుకుపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో ఎర్రమట్టిని తరలించుకుపోతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎర్రమట్టి మాఫియా నుంచి తమ ఊరిని, తిప్పను కాపాడాలని పలు మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదని బైన్దొడ్డి గ్రామస్తులు వాపోయారు.
మండలంలోని బైన్దొడ్డి తిప్ప నుంచి ఎర్రమట్టి తరలింపుకు ఎవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. తిప్ప నుంచి ఎవ్వరైనా ఎర్రమట్టి తరలించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– నాగరాజు, తహసీల్దార్, కోడుమూరు
తవ్వకాలను అడ్డుకునే వారిపై దాడులు
పగలంతా కొండ పక్కన ఉన్న పొలాలు, తోటల్లో యంత్రాలను దాచి పెట్టి చీకటి పడిందంటే చాలు అక్రమార్కులు ఎర్రమట్టి తరలింపును చేపడుతున్నారు. తిప్ప నుంచి ఎర్రమట్టి తవ్వకాలను ఆపాలంటూ వెళ్లే బైన్దొడ్డి గ్రామస్తులు, రైతులపై మాఫియా దాడులకు సైతం తెగబడుతోంది. దీంతో గ్రామస్తులు తిప్ప వైపు పోవాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
అనుమతులు లేకున్నా
ఎర్రమట్టి తవ్వకాలు
పులకుర్తి టీడీపీ నేత కనుసన్నల్లోనే
తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు


