కలెక్టర్ వాహనాన్ని అడ్డగించిన డి.బెళగల్ గ్రామస్తులు
కోసిగి: ‘మేడమ్.. ట్యాంకులకు నీళ్లు ఎక్కడం లేదు.. కుళాయిలకు నీళ్లు రావడం లేదు.. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. పనులు మానుకుని తోపుడు బండ్లపై నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు’ అంటూ డి.బెళగల్ గ్రామస్తులు కలెక్టర్ డాక్టర్ సిరికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు నీటి కోసం మండు వేసవిలో అవస్థలు పడుతున్నారు. రెండు నెలలుగా తాగునీరు సరఫరా సక్రమంగా లేకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. కుళాయిలకు నీరు సరఫరా కాగా నిరుపయోగంగా మారాయి. గ్రామ శివారులో ఉన్న గుమ్మీల వద్ద ట్యాంక్కు నీరు ఎక్కడం లేదు. మహిళలు పనులు మానుకుని దూర ప్రాంతాల నుంచి తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామంలోని చెరువు, చెక్డ్యామ్లను పరిశీలన నిమిత్తం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గురువారం గ్రామానికి చేరుకున్నారు. ఆమె పరిశీలించి వాహనంలో తిరిగి వెళ్తుండగా వాహనాన్ని ఆ గ్రామ ప్రజలు అడ్డగించారు. తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేశారు. అలాగే దొడ్డి గ్రామంలో ప్రజలు ఆమెను కలిసి తాగునీటి సమస్యను ఆమె దృష్టికి తెచ్చారు. ఈ మేరకు సంబంధిత నీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రెండు నెలలుగా నీళ్ల కోసం
ఇబ్బందులు పడుతున్నాం
పనులు మానుకుని తోపుడు బండ్లపై
తెచ్చుకుంటున్నాం
జిల్లా కలెక్టర్ వాహనం అడ్డగించిన
డి.బెళగల్, దొడ్డి గ్రామస్తులు


