యువ శక్తి.. విజయ కీర్తి
● వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుతున్న యువత
విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న వైనం ● నేడు స్వామి వివేకానంద జయంతి
దేశ రక్షణలో భాగస్వామి కావాలని..
చిత్రంలో ఉన్నది దూది మనీషా. ఆళ్లగడ్డ మండలం రామతీర్థం గ్రామానికి చెందిన దూది లక్ష్మమ్మ, దూది చిన్నమద్దిలేటి దంపతుల కుమార్తె. రామతీర్థం జెడ్పీహెచ్ఎస్లో పాఠశాల విద్య, నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్వైవీసీపీ కళాశాలలో ఇంటర్ చదివారు. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో శిక్షణ పొంది దేశ సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్సీసీలో చేశారు. గత ఏడాది మేలో నంద్యాలలో 9 ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీసీ శిబిరం–1, 2లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అనంతపురంలో 6వ ఆంధ్రా పటాలం ఆధ్వర్యంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరం–1లో పాల్గొని బంగారు పతకం సాధించారు. ఆగస్టు 21 నుంచి 30వ తేదీ వరకు అనంతపురంలోనే జరిగిన తల్ సైనిక్ తుది శిబిరంలో కూడా రాణించి బంగారు పతకం అందుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ శిబిరంలో పాల్గొని బంగారు పతకాలు సాధించి అభినందనలు అందుకున్నారు. ‘తల్లిదండ్రులు సహకారం, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎన్సీసీ ఆఫీసర్ అనూషల మార్గదర్శనంలో ఎన్సీసీలో రాణించడం ఆనందంగా ఉంది. ఆర్మీలో చేరి దేశ సేవ చేయడమే లక్ష్యం ’ అని దూది మనీషా చెబుతున్నారు.
జాతి ఖ్యాతి పతాకను విశ్వ వేదికపై రెపరెపలాడించిన స్వామి వివేకానంద ఎందరికో ఆదర్శం. తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో యువతను చైతన్య పరిచారు. నిరుత్సాహం ..నిస్తేజం.. నిరాశ, నిస్పృహ, మానసిక రుగ్మతలు, అసమానతలు వదలి.. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, ఆత్మ వికాసం పెంపొందించుకొని ముందుకు పయనించాలన్నదే వివేకానందుని ప్రభోదనల అంతరార్థం. స్వశక్తిపై ఆధారపడి ఇతరులకు సాయపడేలా మనం నేర్చుకున్న విద్య ఉపయోగ పడాలని వివేకానందుడు బోధించారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతీ యువకుల విజయాల మనోగతం ఇలా.. – కర్నూలు కల్చరల్
చిత్రంలో ఉన్నది ఎం.డి.నాగరాజు. కృష్ణగిరి మండల కేంద్రానికి చెందిన పార్వతమ్మ, సంజీవయ్యల దగ్గర (జేజీ, జేజినాన్నలు పెంచారు) పెరిగిన ఇతను కృష్ణగిరి ఏపీ మోడల్ స్కూల్లో పాఠశాల విద్య, కళా శాల విద్యను అభ్యసించాడు. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలో ని కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బీకాం చివరి చదువుతున్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో శిక్షణ పొందితే అన్నిరంగాలో రాణించడంతో పాటు క్రమశిక్షణతో పాటు దేశ భక్తి అలవుడుతుందని ఇందులో చేరినట్లు నాగరాజు చెబుతున్నాడు. గత ఏడాది మేలో కర్నూలు నగరం సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రా బెటాలియన్–1 ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీసీ శిబిరంలో పాల్గొని రైఫిల్ షూటింగ్లో మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం 6వ ఆంధ్రా బెటాలియన్ వార్షిక శిక్షణ శిబిరంలో కర్నూలు గ్రూప్ తరుఫున పాల్గొని బంగారు పతకం గెలుపొందారు. అనంతపురంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో రజతం, కాకినాడలో ఆంధ్రా బెటాలియన్ –3 ఆధ్వర్యంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో 7వ స్థానం, ఆగస్టులో అనంతపురంలో జరిగిన తల్సైనిక్ తుది శిబిరంలో రైఫిల్ షూటింగ్లో 5వ స్థానంలో నిలిచారు. సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ శిబిరంలో కర్నూలు గ్రూప్నకు ప్రాతినిథ్యం వహించి బంగారు పతకం అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉండి రక్షణ విభాగానికి ప్రాతినిథ్యం వహించాలన్నది తన లక్ష్యమని, కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి, ఎన్సీసీ ఆఫీసర్ కమ్లినాయక్ ప్రోత్సాహంతోనే ఉన్నతంగా రాణిస్తున్నామని నాగరాజు చెబుతున్నారు.
యువ శక్తి.. విజయ కీర్తి
యువ శక్తి.. విజయ కీర్తి


