
గాడితప్పిన విద్యుత్ శాఖ
● గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా అనధికార కోతలు ● ప్రతి రోజూ రెండు మూడు దఫాలుగా 4 గంటల పవర్ కట్ ● ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఏర్పాటులో తీవ్ర జాప్యం ● గ్రామీణ ప్రాంతాల్లో 72 గంటలు, అర్బన్ ప్రాంతాల్లో 48 గంటల నిరీక్షణ ● ఇప్పటికే సర్దుబాటు పేరిట ఎడాపెడా విద్యుత్ చార్జీలు ● ‘స్మార్ట్’ మీటర్ల ఏర్పాటుతో పెరగనున్న భారం
ఎన్నికలయ్యాక చంద్రబాబు
విద్యుత్ బిల్లులను చూస్తే వినియోగదారుల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ముమ్మరంగా సాగుతోంది. సర్దుబాటు పేరిట వినియోగదారులకు ప్రతినెలా షాక్ తగులుతోంది.
ఎన్నికలకు ముందు చంద్రబాబు
మా ప్రభుత్వం ఏర్పాటయితే విద్యుత్ చార్జీలను ఎలాంటి పరిస్థితుల్లో పెంచం. పైగా చార్జీలను తగ్గిస్తాం. స్మార్ట్ మీటర్లను బిగించే ప్రసక్తే లేదు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 10 వరకు
కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల వివరాలు
నెల కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా
ఏప్రిల్ 239 155
మే 604 326
జూన్ 10 వరకు 207 149
మొత్తం 1,050 630
కర్నూలు జిల్లా
రోజువారీ విద్యుత్ వినియోగం కోటా 8.790 మిలియన్ యూనిట్లు. అయితే ఈనెల 1న 8.297, 2న 8.219, 3న 8.473, 9న 7.792 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు కోటా 79.11 మిలియన్ యూనిట్లు కాగా 76.41 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు.
నంద్యాల జిల్లా
రోజువారీ విద్యుత్ వినియోగం కోటా 6.973 మిలియన్ యూనిట్లు. అయితే ఈనెల 1న 6.051, 2న 6.157, 3న 5.820, 9న 5.864 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు కోటా 62.76 మిలియన్ యూనిట్లు కాగా 53.70 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు.
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాది గడుస్తోంది. సర్దుబాటు చార్జీల పేరు తో వినియోగదారులపై అడ్డగోలుగా భారం మోప డంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజులకు పైగా సమయం తీసుకుంటుండటంతో ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని రైతు లు, పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఇచ్చిన కోటా కంటే విద్యుత్ వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ గ్రామీణ ప్రజలకు అనధికార కోతలు తప్పడం లేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందని పండు చందంగా మారింది. పగటి పూటనే 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి ఉండగా.. కనీసం 7 గంటలు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. రాత్రి పూట వ్యవసాయ విద్యుత్ కారణంగా అక్కడక్కడ రైతులు ప్రమాదాల బారిన పడుతుండటం గమనార్హం.
ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అ‘ధన’పు భారం
ఈ వేసవిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 25 కేవీఏ టాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. కర్నూలు జిల్లాలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 10,380, త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 56,188 ఉన్నాయి. నంద్యాల జిల్లాలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 7,600, త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 45వేలు ఉన్నాయి. ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, ఉరుములు, పిడుగుపాటు ఘటనలతే ఎప్పుడూ లేని విధంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. ఏప్రిల్ నుంచి జూన్ నెల 10వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 1,050, నంద్యాల జిల్లాలో 630 ట్రాన్స్ఫార్మరు కాలిపోవడం గమనార్హం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు అర్బన్ ప్రాంతాల్లో అయితే 12 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల్లోగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలి. అప్పుడే రైతులు పంటలు దెబ్బతినకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్పోర్టు ఖర్చు కూడా విద్యుత్ శాఖదే. అయితే నిర్ణీత సమయం ప్రకారం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న దాఖలాల్లేవు. పైగా ట్రాన్స్పోర్టు ఖర్చులను సైతం రైతుల నెత్తినే వేస్తున్నారు. డిపార్టుమెంట్ వాహనంలోనే తరలిస్తూ వేలాది రూపాయలను రైతుల నుంచి వసూలు చేస్తున్నారు.
‘స్మార్ట్’ షాక్..
వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లను చంద్ర బాబు, ఆయన తనయుడు లోకేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టాలని పిలుపు నిచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవే స్మార్ట్ మీటర్లు ముద్దయ్యాయి. ఇప్పటికే పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు స్మార్ట్ మీటర్లు బిగించేశారు. ఈ కారణంగా అంతకుముందు రూ.3వేల వరకు వచ్చే బిల్లు ఇప్పుడు రూ.30వేలకు చేరుకుంది. తాజాగా 200 యూనిట్లకు పైబడి విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ సాగుతుండటం గమనార్హం. 2023 సంవత్సరంలో రూ.600 ప్రకారం వచ్చే బిల్లు 2025లో రూ.1000 పైగా వస్తోంది. ప్రతి వినియోగదారుడిపై సర్దుబాటు చార్జీల భారం పడుతోంది. ఇక స్మార్ట్ షాక్ ఏస్థాయిలో ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

గాడితప్పిన విద్యుత్ శాఖ