పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
● త్రుటిలో తప్పిన ప్రమాదం
హాలహర్వి: మండల కేంద్రం సమీపంలో ఆదోని నుంచి బళ్లారికి వెళ్లే ప్రైవేట్ బస్సు బుధవారం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
డ్రస్ కోసం ఆర్డర్ ఇస్తే ఖాతాలోని డబ్బు స్వాహా
కర్నూలు: సైబర్ నేరగాళ్లు రోజుకోరకంగా బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారు. కర్నూలు వాసవీ నగర్కు చెందిన సరిత ఆన్లైన్లో డ్రస్ ఆర్డర్ ఇచ్చి డబ్బులు చెల్లించేందుకు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా మొదట రూ.2,919 ఆమె ఖాతాలో నుంచి జమ అయింది. కొద్దిసేపు తర్వాత రెండో విడత రూ.81,781 ఖాతాలో నుంచి ట్రాన్స్ఫర్ (బదిలీ) అయినట్లు మెసేజ్ రావడంతో ఆమె అవాక్కయింది. సైబర్ నేరగాళ్లే తన ఖాతా నుంచి డబ్బు స్వాహా చేసినట్లు నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిమ్మాపురంలో చోరీ
మహానంది: ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన బి.భక్తశేషారెడ్డి(భక్తుడు) ఇంట్లో చోరీ జరిగింది. భక్తశేషారెడ్డి దంపతులు గత నెల 30న ఉగాది పర్వదినం సందర్భంగా అనంతపురానికి వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోగా ప్రధాన ద్వారం తలుపు బోల్ట్ ఊడిన విషయం గుర్తించి లోపలకు వెళ్లి చూడగా బీరువాతో పాటు లాకర్లను పగలగొట్టడాన్ని గుర్తించారు. బీరువాలోని రూ.రెండు లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలతోపాటు మరికొన్ని వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. ఎస్ఐ రామ్మోహన్న్రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని ఇంటిని పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తామని ఎస్ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో కూలీ మృతి
తుగ్గలి: విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా.. పత్తికొండ మండలం పందికోనకు చెందిన సురేంద్ర(33) విద్యుత్ పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లాడు. తుగ్గలి మండలంలోని దిగువచింతలకొండ వద్ద ఓ రైతు పొలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తుండగా సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్ లైన్కు స్తంభం తాకడంతో షాక్కు గురయ్యాడు. తోటి కూలీలు వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. తుగ్గలి ఎస్ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలానికి వెళ్లి మృతికి కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు


