పారిశ్రామికాభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.24,671 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, క్రాప్ ఇన్సూరెన్స్ పురోగతిపై కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చర్చించారు. అనంతరం వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ రంగాల అభివృద్ధికి ఉపయోగపడే వ్యవసాయం, పంట రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన రుణ సదుపాయాలను కల్పించేందుకు ఈ ప్రణాళికను రూపొందించామన్నారు. 2026 –27 వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.18,224 కోట్లు కేటాయించగా ఇందులో వ్యవసాయరంగానికి రూ.12,719 కోట్లు, పంట రుణాలకు రూ.6,785 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి రూ.4,250 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఆర్.ప్రదీప్కుమార్, ఆర్బీఐ సీడీఓ పి.యలమంద, నాబార్డు డీపీఎం అనిల్కాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవీంద్రరెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టా లని కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం పారిశ్రామిక ఎగుమతి, ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు మూడు నుంచి 31వ తేదీ వరకు 107 దరఖాస్తులు అందగా వాటిలో 79 దరఖాస్తులు ఎస్ఎల్ఏ గడువులోపు ఆమోదం పొందాయన్నారు. ఈ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025లో కుదిరిన అవగాహన ఒప్పందాల పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. భూముల కేటాయింపు, మౌలిక వసతులు, తదితర అంశాల్లో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం సమన్వయంతో పనిచేయాలన్నారు. పరిశ్రమలకు వడ్డీ రాయితీ క్లయిమ్ల ద్వారా ఐదు పరిశ్రమ లకు రూ.1.36 కోట్ల మేర ప్రోత్సాహకాలను మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఎల్డీఎం రవీంద్రరెడ్డి, డీపీఓ ఎం.ధనలక్ష్మి, డీఆర్డీఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


