చల్లపల్లి: ప్లాస్టిక్ లేని గ్రామంగా చల్లపల్లి ఆదర్శంగా నిలవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆకాంక్షించారు. గ్రామంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలుకానున్న ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు, పేపర్ కప్పులు, పేపర్ ప్లేట్లు, గ్లాసులు వంటివాటి నిషేధానికి వ్యాపారులు, వినియోగదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చల్లపల్లి నుంచి నాంది పలకాలని ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రధాన సెంటర్ వరకూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ బాలాజీతోపాటు ప్రజాప్రతినిధులు, అధికా రులు, ప్రముఖ వ్యాపారులు, సామాజికవేత్తలు, విద్యార్థులు ర్యాలీ పాల్గొన్నారు. ప్లకార్డులు చేబూని ప్లాస్టిక్ వద్దు.. సమాజం ముద్దు.. అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన సెంటర్కు చేరుకుని మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ ఉద్యమాన్ని మూడు వారాల క్రితమే ప్రారంభించాల్సి ఉండగా పలువురు వ్యాపారుల సూచనల మేరకు సోమవారం నుంచి అమలు చేస్తున్నామన్నారు. టీ స్టాళ్లు, హోటళ్లలో గాజు గ్లాసుల్లోనే టీ, కాఫీ ఇవ్వా లని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు పలు సూచనలు చేశారు. పోలీసులు సహకరించాలని కోరారు. అనంతరం అంద రితో ప్రతిజ్ఞ చేయించారు. అంనతరం నార చేతి సంచులు, కాటన్ చేతి సంచులను పలువురికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ డి.ధనలక్ష్మి, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ బి.నిఖిల, డీఎల్పీఓ ఎండీ రజావుల్లా, అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, ఎంపీడీఓ ఎం.ఎం. ఆనందకుమారి, సీఐ కె.ఈశ్వరరావు, ఎస్ఐ డి.దుర్గాంజనేయులు, ఈఓపీఆర్డీ పేర్ని మాధవేంద్రరావు, ఎంఈఓ–2 పి.వెంకటేశ్వర రావు, పీఆర్ ఏఈ బి.శ్రీనివాసరావు, స్వచ్ఛ చల్లపల్లి రథసారథి డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, అడపా గురవయ్య మాస్టారు, ప్రజా ప్రతినిధులు, విజయా, విజయ క్రాంతి జూనియర్ కళాశాలలు, చల్లపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ


