ఎ.కొండూరు: మండల పరిధిలోని కుమ్మరికుంట్ల గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ గోతిలో పడి మృతి చెందాడు. దీనికి అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఈ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎ.కొండూరు మండలం కుమ్మరి కుంట గ్రామం వద్ద కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ఆదివారం రాత్రి కొండూరు నుంచి విస్సన్నపేట వైపు వెళ్తున్న వి.సంజయకుమార్ (28) బ్రిడ్జిని గమనించలేకపోయాడు. ఈ క్రమంలో అతను బైక్తో సహా బ్రిడ్జి పిల్లర్ కోసం తవ్విన గోతిలో పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డు, రేడియం సూచికలు గానీ, రక్షణ బారికేడ్లుగానీ ఏర్పాటు చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్, అధికారుల అనాలోచిత, నిర్లక్ష్య వైఖరితో నిండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబానికి స్వామిదాసు పరామర్శ
విషయం తెలిసిన వెంటనే తిరువూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్, మాజీ జెడ్పీ చైర్మన్ ఎన్.సుధారాణి, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరెడ్ల వీరారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని, మృతుడు సంజయకుమార్ భౌతికకాయాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, తక్షణమే ప్రభుత్వం మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని, నిర్లక్ష్యానికి కారణమైన కాంట్రాక్టర్, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిర్మాణంలో ఉన్న
బ్రిడ్జి వద్ద హెచ్చరిక బోర్డులు లేవు


