మచిలీపట్నంఅర్బన్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి టి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఐక్య ఉద్యమంలో భాగంగా సోమవారం మీ కోసంలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు పెండింగ్ డీఏలను ప్రకటించి, బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు గతంలో మాదిరిగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి ప్రతిపాదించిన 29 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు. తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే ఏపీ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాల్లో వెనుకపడుతున్నారని పేర్కొన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పేపేటి సత్యనారాయణ, ఏపీ జేఏసీ చైర్మన్ ఎం.శ్యామనాథ్, జిల్లా ఏపీ అమరావతి సెక్రటరీ జనరల్ వైవీ రావు, ఏపీ రెవిన్యూ అసోసియేషన్ నాయకులు నెల్సన్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి
రాష్ట్ర కోశాధికారి నాగేశ్వరరావు


