లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదల వైద్యానికి పెద్దదిక్కుగా ఉన్న విజయవాడ జీజీహెచ్కు పరికరాలు సమకూర్చడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెండేళ్లుగా వెంటిలేటర్లు, వర్క్ స్టేషన్లు కావాలని వినతులు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో మొండి పరికరాలతో వైద్యులు కుస్తీ పట్టాల్సిన దయనీయ స్థితి నెలకొంది. ఈ విషయమై ఆస్పత్రిని సందర్శించిన వైద్య మంత్రి, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలకు అధికారులు పలు మార్లు తెలియజేసినా.. వారిలో ఒక్కరూ స్పందించలేదు. దీంతో ఆధునిక పరికరాలు లేకుండానే చికిత్సలు మమ అనిపిస్తున్నారు.
ఎన్నాళ్లీ వెంటి‘లేట్’ర్లు..
కోవిడ్ సమయంలో ప్రభుత్వాస్పత్రికి దాదాపు 200 వరకూ వెంటిలేటర్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అవి పనిచేయని స్థితికి చేరుకున్నాయి. ఒకవైళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని వాటిపై ఉంచితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కొత్త వెంటిలేటర్లు కావాలని వైద్యాధికారులు రెండేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదిగో ఇస్తాం..ఇదిగో ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారే కానీ కొత్త వెంటిలేటర్లు మాత్రం సరఫరా కావడం లేదు. వాటి కొనుగోళ్లు టెండర్ల దశ దాటడం లేదు.
థియేటర్లలోఉక్కపోత..
సూపర్స్పెషాలిటీ బ్లాక్లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోగికి ఇన్ఫెక్షన్ సోకకుండా మాడ్యులర్స్, లామినర్ ఫ్లోర్ ఏర్పాటు చేశారు. కానీ వాటిలో ఏసీలు పనిచేయడం లేదు. ఈ విషయమై ఆస్పత్రి అధికారులు ఎన్నిసార్లు వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదు. ‘మా వద్ద నిధులు లేనిదే మేం ఏమి చేస్తాం’ అనేది వారి సమాధానంగా తెలుస్తోంది. దీంతో ఎస్ఎస్ బ్లాక్లోని ఆపరేషన్ థియేటర్లలో రోగులతో పాటు, వైద్యులు, సిబ్బంది ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
సౌకర్యాలు, పరికరాలు
సమకూర్చడంలో నిర్లక్ష్యం
రెండేళ్లుగా వెంటిలేటర్ల కోసం
ఎదురుచూపులు
ఆపరేషన్ థియేటర్లలో
ఏసీలు పనిచేయవు, వర్క్ స్టేషన్లు లేవు
గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరో, ఆప్తమాలజీ
విభాగాల్లో పరికరాల కొరత
ఉన్నతాధికారులకు పలుమార్లు
నివేదించినా ఫలితం శూన్యం


